రైతుల కోసం కేంద్రం చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ద్వారా ప్రతి ఒక్కరికీ 14 అంకెల ప్రత్యేక సంఖ్య ఇవ్వనున్నారు. పీఎం కిసాన్, పంటల బీమా వంటి పథకాల కోసం ఇది తప్పనిసరి.

రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా "యూనిఫైడ్ ఫార్మర్ రిజిస్ట్రీ" అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు 14 అంకెలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. దీనిని యూనిట్ ఫార్మర్ ఐడీగా పిలుస్తారు. వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఒకే చోట భద్రపరచడం, పాలసీ అమలును వేగవంతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

14 అంకెల ప్రత్యేక సంఖ్య…

ఈ రిజిస్ట్రీ కోసం రైతులు తమ మండల వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలి. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అందించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మూడు వేర్వేరు ఓటిపిలు మొబైల్‌కు వస్తాయి. వాటిని అధికారికి తెలియజేస్తే, రైతుకు 14 అంకెల ప్రత్యేక సంఖ్య జారీ అవుతుంది.

ఈ యూనిక్ ఐడీ ఆధారంగా రైతులన్నింటి సమాచారం కేంద్ర డేటాబేస్‌లో ఉంటుందంటూ అధికారులు పేర్కొన్నారు. ఫసల్ బీమా యోజన, పీఎం కిసాన్ నిధులు, సబ్సిడీలు, మౌలిక వసతులు లాంటి కేంద్ర పథకాల లబ్దిదారులైన రైతుల వివరాలను గుర్తించేందుకు ఈ సంఖ్య కీలకం కానుంది. ఇకపై ఇలాంటి పథకాల ప్రయోజనాలు పొందాలంటే రైతు ఐడీ తప్పనిసరి అవుతుంది.

వ్యవసాయ రంగాన్ని డిజిటలీకరించేందుకు, స్పష్టమైన రైతు గణాంకాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇది రైతు సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలు చేయడంలో కీలకంగా మారనుంది.