తన ప్రాణాలకు ముప్పు ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని నటి గౌతమి విజ్ఞప్తి చేయడం సంచలనంగా మారింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే?

సీనియర్‌ నటి, రాజకీయ నాయకురాలు అయిన గౌతమి తన ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతూ పోలీసుల రక్షణ కోరింది. చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరింది. ఆస్తి తగాదాల కారణంగా ఈ బెదిరింపులు వస్తున్నాయని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. నిరంతర బెదిరింపులపై ఆందోళన వ్యక్తం చేసిన గౌతమి, తన భద్రతను ఏర్పాటు చేయడానికి పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.

ఆక్రమణకు గురైన గౌతమి కోట్ల ఆస్తి

చెన్నైలోని నీలంకరైలో గౌతమికి చెందిన తొమ్మిది కోట్ల రూపాయల విలువైన ఆస్తికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. ఈ ఆస్తిని అజగప్పన్ అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకున్నాడని ఆరోపిస్తూ గౌతమి ఇంతకుముందు ఫిర్యాదు చేసింది. దీని తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆ భూమిని సీజ్ చేశారు. ఈ సమస్యే ఇప్పుడు గౌతమికి బెదిరింపులు రావడానికి కారణమైందని `టైమ్స్ ఆఫ్ ఇండియా` పత్రిక కథనం ప్రచురించింది.

న్యాయవాద ముసుగులో బెదిరిస్తున్నారని గౌతమి ఆరోపణలు

తన భూమి ఆక్రమణలను అడ్డుకోవడానికి కొంతమంది అధికారులు లంచం డిమాండ్ చేశారని గౌతమి ఫిర్యాదులో ఆరోపించింది. అంతేకాకుండా, తనను న్యాయవాదులమని పరిచయం చేసుకున్న కొంతమంది తనను బెదిరిస్తున్నారని ఇండియా గ్లిట్జ్ తమిళ వెబ్‌సైట్‌ను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక కథనం తెలిపింది. కొంతమంది తనపై నిరసన తెలిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారని, అది తనను హాని చేసేందుకు చేస్తున్న కుట్రలో భాగమని ఆమె అనుమానిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.