మనం వంటగదిలో ఉపయోగించే కొన్నిసుగంధ ద్రవ్యాలు.. వంటలకు రుచిని పెంచడమే కాదు.. మంచి ఔషధాలుగా కూడా పనిచేస్తాయి. ఇవి సహజంగా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చాలా రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఏ పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే మన వంటగదిలో దాగి ఉన్న కొన్ని మసాలా దినుసులు రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుతాయనే విషయం మీకు తెలుసా? ఈ సుగంధ ద్రవ్యాలను రెగ్యులర్ గా తీసుకుంటే.. ఖరీదైన మందుల అవసరమే ఉండదు అంటున్నారు నిపుణులు. మరి ఆరోగ్యానికి మేలు చేసే ఆ మసాలా దినుసులేంటో ఓసారి చూద్దామా..
రోగనిరోధక శక్తిని పెంచే సుగంధద్రవ్యాలు
పసుపు
పసుపులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడమే కాకుండా రోగనిరోధక కణాలను ఉత్తేజపరుస్తుంది. ప్రతిరోజూ రాత్రి వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది.
మిరియాలు
మిరియాలలో పైపెరిన్ అనే మూలకం ఉంటుంది. ఇది శరీరంలో పోషకాల శోషణను పెంచుతుంది. ముఖ్యంగా పసుపుతో కలిపి తీసుకున్నప్పుడు దాని ప్రభావం రెట్టింపు అవుతుంది.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. దీని పొడిని పాలు, టీ లేదా ఓట్స్లో కలుపుకొని తీసుకోవచ్చు. లేదా ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. కొన్ని అధ్యయనాల ప్రకారం దాల్చిన చెక్కను రోజువారీ ఆహారంలో తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.
అల్లం
అల్లంలో జింజెరాల్ ఉంటుంది. ఇది మంటను తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. అల్లాన్ని టీ, కషాయం లేదా వంటల్లో వాడుకోవచ్చు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాలను ఉత్తేజపరుస్తుంది. వైరల్-ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి రెబ్బ, వాటర్ తీసుకోవచ్చు. లేదా వంటకాల్లో కూడా వేసుకోవచ్చు.
తులసి
తులసి యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.