ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. ఆదివారం మధ్యాహ్నం కొత్త మంత్రులు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంత్రుల జాబితాను అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా మంత్రి వర్గంలో చేరబోతున్న ఎమ్మెల్యేల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఈ వివరాలను ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. మంత్రిగా నియమితులైన వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలకు అభినందనలు తెలిపారు. అలాగే రామచంద్రునాయక్ డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించనున్నారని తెలిపారు.
కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:00 నుంచి 12:20 గంటల మధ్య, హైదరాబాద్లోని రాజ్భవన్ వేదికగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం అధికారికంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వంటి బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. బీసీ వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి ముదిరాజ్, మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి, మాదిగ వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రులుగా ఎంపికయ్యారు. ఎస్టీ వర్గానికి చెందిన రామచంద్రునాయక్ డిప్యూటీ స్పీకర్ పదవికి ఎంపికయ్యారు.
మంత్రి వర్గ విస్తరణపై స్పందించిన పొన్నమ్
మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశంలో కులగణన అవసరమా అని ప్రశ్నించేవారికి, ఈ మంత్రి వర్గ విస్తరణే సరైన సమాధానం’’ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని నిజంగా అమలు చేస్తోందని, రాహుల్ గాంధీ కులగణన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిన దానివల్లే ఇవాళ ఈ స్థాయిలో బలహీన వర్గాలకు అవకాశం లభించిందన్నారు.
‘‘రాహుల్ గాంధీ తెచ్చిన కులగణన ఆలోచన దేశానికి మేలుకొల్పేలా మారింది. తెలంగాణలో మొదలైన ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే కేంద్ర బీజేపీ కూడా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది’’ అని తెలిపారు.