అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, ప్ర‌ముఖ వ్యాపారవేత్త ఎలాన్ మ‌స్క్‌ల మ‌ధ్య నెల‌కొన్న వివాదం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య పలు అంశాల్లో వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఇరు కీలక వ్యక్తుల మధ్య విభేదాలు విమర్శల వరకు వెళ్లాయి. అయితే తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, వారి బంధం మళ్లీ స్నేహ దిశగా వెళ్తుందా అన్న చర్చ మొదలైంది.

ఇటీవల ట్రంప్ టెస్లా నుంచి ఒక కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో మ‌స్క్‌తో మాట‌ల యుద్ధం న‌డుస్తుండ‌డంతో ఆ కారు వాడకాన్ని నిలిపేస్తారని అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. "అలాంటిదేమీ లేదు. నేను ఆ కారులో క్రమం తప్పకుండా తిరుగుతున్నాను" అని స్పష్టం చేశారు.

ఇక వైట్‌హౌస్‌లో మస్క్‌కి చెందిన స్టార్‌లింక్‌ (Starlink) ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారన్న వార్తలపై కూడా ట్రంప్ స్పష్టత ఇచ్చారు. "స్టార్‌లింక్ మంచి సేవలు అందిస్తోంది. దానిని నిలిపివేయాలన్న ఉద్దేశం నాకు లేదు" అంటూ తెలిపారు. మస్క్‌తో మళ్లీ మాట్లాడతారా?" అనే ప్రశ్నకు ట్రంప్ వ్యూహాత్మక సమాధానం ఇచ్చారు. "నేను మస్క్ స్థానంలో ఉంటే మాట్లాడాలని అనుకునేవాడిని. అతడూ అలాగే అనుకుంటే సంతోషం. అతనిని అడగండి. మేమిద్దరం ఇప్పటికీ మంచి సంబంధమే కలిగి ఉన్నాం. మస్క్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నా" అని అన్నారు.

దీంతో ట్రంప్‌, మ‌స్క్‌ల మ‌ధ్య స్నేహ బంధం మొద‌లువుతందా.? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనిపై క్లారిటీ రావాలంటే ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు అధికారికంగా స్పందించే వర‌కు వేచి చూడాల్సిందే.